
స్నానోత్సవానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు: ఐజీ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు 15 రోజుల ముందుగా స్నానోత్సవం జరగనుంది. ఏటా జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని శ్రీ మందిరం ప్రాంగణంలో భారీ స్థాయిలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీమందిరం ప్రహరి మేఘనాథ్ ప్రాంగణంలో బహిరంగ మండపంపై మూల విరాట్లకు స్నానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 11న శ్రీ జగన్నాథుని స్నానోత్సవం జరుగుతుంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సెంట్రల్ రేంజ్ ఇన్స్పెక్టరు జనరల్ (ఐజీ) ఎస్. ప్రవీణ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు వినీత్ అగర్వాల్, అదనపు పోలీసు సూపరింటెండెంటు, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ), ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథ యాత్ర పురస్కరించుకుని శాంతిభద్రతల స్థితిగతుల్ని సమీక్షించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై లోతుగా చర్చించారు. త్వరలో జరగనున్న స్నాన యాత్రలో శాంతిభద్రతల పరిరక్షణతో భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాల్ని మోహరించనున్నట్లు కేంద్ర ఐజీ తెలిపారు. ఈ ఉత్సవానికి సమగ్రంగా 70 ప్లాటూన్ల పోలీసు బలగాల్ని మోహరించనున్నారు. 4 మంది పోలీసు సూపరింటెండెంటు హోదా కమాండెంట్లు, 450 మంది ఇతర స్థాయి అధికారుల్ని నియమించనున్నారు. స్నాన యాత్ర సందర్భంగా పూరీ పట్టణంలో ప్రధానంగా యాత్ర ప్రాంగణం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు జారీ చేయనున్నారు. తాత్కాలికంగా వాహనాల కదలికని నియంత్రించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ద్వితీయ సర్వ సభ్య సమావేశం జరగనుంది. రాష్ట్ర న్యాయ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ అధ్యక్షతన ఈ సమావేవం జరుగుతుంది. పూరీ రథ యాత్ర ఏర్పాట్లుపై సమగ్రంగా ఈ సమావేశంలో సమీక్షిస్తారు.