
పోలీసుల అదుపులో మేధా పాట్కర్
రాయగడ: పర్యావరణ వేత్త, ప్రముఖ సమాజ సేవకురాలు మేధా పాట్కర్ను రాయగడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రత్యేక వాహనంలో బరంపురం తరలించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె కాశీపూర్ పరిధి హొటొపొదొరొలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలి. గురువారం తెల్లవారున హిరాఖండ్ ఎక్స్ప్రెస్లో రాయగడ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెతో పాటు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు జరుగుతున్నాయి. మేధా పాట్కర్ ఆ ప్రాంతానికి వెళ్లి ప్రసంగిస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించి ఆమెను అక్కడకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆమెతో పాటు పర్యావరణ వేత్త ప్రఫుల్ల సామంత, కృషక్ నాయకుడు లింగరాజ్, నరేంద్ర మహాంతి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అభివృద్ధికి వ్యతిరేకిని కాను..
తాను అభివృద్ధికి వ్యతిరేకిని కానని మేధా పాట్కర్ తెలిపారు. సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. శాంతి యుతంగా జరిగే ఇలాంటి కార్యక్రమాల్లో గతంలోనూ పాల్గొన్నానని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న మేధా పాట్కర్ తాను ఓ పాత్రికేయుడిని కలవాలని కోరగా.. స్థానికంగా ఉంటున్న ప్రముఖ పాత్రికేయుడు కీర్తి చంద్ర సాహు ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటిలో అల్పాహారం తీసుకున్న తర్వాత తిరిగి పోలీసులు ఆమెను ప్రత్యేక వాహనంలో బరంపురం తరలించారు.

పోలీసుల అదుపులో మేధా పాట్కర్