
వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడి మృతి
రాయగడ : వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతిచెందాడంటూ కుటుంబ సభ్యులు బ్లడ్బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక న్యూకాలనీలో నివాసముంటున్న మధుసూదన్ టరికి కుమారుడు తొమ్మిదేళ్ల రాజీవ్ టకిరి రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. జ్వర తీవ్రత పెరగడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడికి రక్తం తక్కువగా ఉందనే, వెంటనే రక్తాన్ని ఎక్కించాల్సి ఉందని వైద్యులు సూచించారు. బాధితులు వెంటనే రక్త నిధికి వెళ్లగా నిల్వలు లేవని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు రక్తనిధి కేంద్రం డాక్టర్ గౌతం పట్నాయక్ వచ్చి అవసరమైన రక్తం ఉందని చెప్పి రాజీవ్కు రక్తం ఎక్కిస్తుండగా బాలుడు మృతి చెందాడు. దీంతో కోపోద్రుక్తులైన బాధిత కుటుంబీకులు రక్తం రాత్రి లేదని చెప్పి.. తెల్లవారే సరికి ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆందోళనకు దిగారు. రాత్రే రక్తం ఎక్కిస్తే తమ కొడుకు బతికేవాడంటూ విలపించారు. స్థానిక సేవా సంస్థలు విరివిగా బ్లడ్ డొనేషన్ శిబిరాలు నిర్వహిస్తూ ఆయా సంస్థలు సేకరించిన రక్త యూనిట్లను ప్రభుత్వ రక్తనిధికి తరలిస్తుంటే.. ఇక్కడ రక్తం లేదని చెప్పడం తగదని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు.