
ప్రైవేటు విద్యాసంస్థల్లో దోపిడీ అరికట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతోందని, అటువంటి నిర్వాహకులపై జిల్లా విద్యాశాఖాధికారులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఎగైనెస్ట్ కరప్షన్ నేషనల్ అంబాసిడర్ నాయుడుగారి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దోపిడీలకు పాల్పడుతున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని కోరారు.
నేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయాలి
ఎచ్చెర్ల: మగ్గమున్న ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటియూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ, చేనేత కార్మిక సంఘం నాయకుడు నక్కిన అసిరప్పడు డిమాండ్చేశారు. మంగళవారం లావేరులో పర్యటించి చేనేత కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించి అనంతరం మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికులు గిట్టుబాటు ధరలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ చేసి ఆప్కో ద్వారా ప్రభుత్వం వస్త్రాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేతన్న నేస్తం పథకం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత సంఘం నాయుకులు కె.శంకరరావు, కె.రామారావు, యు.గంగరాజు, కె.గంగరాజు, భద్రకాళీ, బి.వెంకటరావు, యు.కాశీవిశ్వేశ్వరరావు, శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీఐల్లో ప్రవేశాలకు ఆహ్వానం
ఎచ్చెర్ల: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం షెడ్యూల్ విడుదలైందని ఐటీఐ ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ లండ సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 5 నుంచి 10 వరకూ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, మోటార్ వెహికల్, డ్రాఫ్ట్మెన్, సివిల్ ట్రేడ్, వెల్డర్, డీజిల్ మెకానిక్, కట్టింగ్, టైలరింగ్, కోపా తదితర ట్రేడ్లలో ప్రవేశాలను కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని మూడు ప్రభుత్వ కళాశాలలో 640 సీట్లు, 20 ప్రైవేటు కళాశాలల్లో 2,872 సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
సిమెంట్ లారీ దగ్ధం
నరసన్నపేట: తామారాపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సిమెంట్ లారీ దగ్ధమైంది. విశాఖ నుంచి పూరీ వెళ్తుండగా తామరాపల్లి వద్దకు వచ్చే సరికి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయగా లారీ నిలుపు చేసి తగిన జాగ్రత్తలు తీసుకొనే లోపే మరింతగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా ఎస్ఎఫ్ఓ వరహాలు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు. అప్పటికే లారీ కాలిపోయింది. ఈ ఘటనలో రూ. 5 లక్షల పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు లారీ సిబ్బంది చెబుతుండగా.. అగ్నిమాపక సిబ్బంది మాత్రం రూ.2.5 లక్షల వరకూ నష్టం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
విధులకు ఆటంకపరిచారని ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో గతంలో సహాయ సంచాలకులుగా పనిచేసిన పి.సూర్యారావు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది విధులకు ఆటంకపరుస్తున్నారంటూ ప్రస్తుత ఆ శాఖ సంయుక్త సంచాలకుడు రాజగోపాల్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ పి.ఈశ్వరరావు మంగళవారం తెలిపారు. గతంలో సస్పెన్షన్కు గురైన సూర్యారావుకు హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ క్రమంలో సూర్యారావు కొంతమంది పత్రికా విలేకరులు, వీడియోగ్రాఫర్లను తన వెంట జిల్లా పశుసంవర్ధక కార్యాలయానికి తీసుకెళ్లి విధి నిర్వహణ నిమిత్తం తాను వచ్చానని, అటెండెన్సు రిజిస్టర్లో సంతకం పెడతానంటూ చెప్పడమే కాక వచ్చే పత్రికా విలేకరులతో వీడియో రికార్డింగ్ చేయించారన్నారు. పశుసంవర్ధక శాఖ విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి తగు ఉత్తర్వులు వచ్చేంతవరకు కార్యాలయంలో సూర్యారావును జాయిన్ చేసుకునే అవకాశం లేదని ఎంత చెప్పినప్పటికీ సిబ్బందిని భ భయభ్రాంతులకు గురిచేసి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో దోపిడీ అరికట్టాలి

ప్రైవేటు విద్యాసంస్థల్లో దోపిడీ అరికట్టాలి