
ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
జయపురం: మన న్యాయమైన డిమాండ్లు నేరవేరాలంటే అందరం సమైక్యంగా ఆందోళన చేపట్టాలని ఒడిశా డ్రైవర్ల మహాసంఘ బొయిపరిగుడ సమితి శాఖ అధ్యక్షుడు మాధవ బిశాయి పిలుపు నిచ్చారు. నేడు జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితి డ్రైవర్ల సమావేశం బొయిపరిగుడ సంత తోటలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డిమాండ్ల సాధనకు ఒడిశా డ్రైవర్ల మహాసంఘం స్టీరింగ్ చడో ఆందోళన చేపట్టాలని నిర్ణయించిందని, అందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. మహాసంఘం 9 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా పాలకులు కేవలం ఒక్క డిమాండ్ మాత్రం నేరవేర్చారని ఆయన డ్రైవర్లకు వివరించారు. మిగతా 8 డిమాండ్లను తుంగలో తొక్కారని విమర్శించారు. డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, జాతీయ రహదారిలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకర టాయిలెట్తో పాటు పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, డ్రైవర్ల పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలని, డ్రైవర్లు ఏ తప్పు లేకుండా దాడులకు గురవుతున్నారని వాటిని అరికట్టి డ్రైవర్లకు రక్షణ కల్పించాలని కోరారు. డిమాండ్లను మరో సారి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. డిమాండ్లు అంగీకరించకుంటే మరోసారి స్టీరింగ్ చఢో ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ఉపాద్యక్షులు సీతమ్ సాగరియ, కార్యదర్శి నరేష్ కంశారి, సహాయ కార్యదర్శి మోమణ పాత్రొ, కోశాధ్యక్షుడు శ్యామ సుందర చలాన్ తో పాటు సమితిలోగల అనేకమంది డ్రైవర్లు పాల్గొన్నారు.