
పకడ్బందీగా రథయాత్ర
● సన్నాహక సమావేశంలో అధికారులు
రాయగడ: ఈ నెల 27వ తేదీన జరగనున్న జగన్నాథ రథాయాత్రను పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు అన్నారు. రథాయాత్ర నిర్వహణపై స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, ఎడీఎం నిహారి రంజన్ కుహారో, రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తదితరులు హాజరయ్యారు. ఈ ఏడాది రథయాత్రను అందరి సహకారంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ అన్నారు. గత ఏడాది రథాయాత్ర నిర్వహణలో భాగంగా విరాళాల రూపంలో 34,14,439 రూపాయలు లభించగా అందుకు సంబంధించి ఖర్చయిన 15,47,820 రుపాయల వివరాలను తహసీల్దార్ ప్రియదర్శిని సమావేశంలో నివేదించారు. ఈ ఏడాది విరాళాల వసూళ్ల బాధ్యతను తహసీల్దార్తో సహా మరో ప్రత్యేక కమిటీకి అప్పగించారు. యాత్ర తొమ్మిది రోజులు స్వామి వారిని దర్శించుకునేందుకు గుండిచా మందిరానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ నాయక్ ఆదేశించారు. దీంతో పాటు ప్రత్యేక పోలీస్ దళంతో గస్తీని ఆయా ప్రాంతాలోఏర్పాటు చేయాలని అందుకు పోలీస్ యంత్రాంగం కూడా తగిన విధంగా సహకరించాలని అన్నారు. సమావేశంవో రాజపురోహితుడు బీరంచి నారాయణ దాస్, రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.