
ఉపాధి పనికి వెళ్తూ వృద్ధుడు మృతి
పాతపట్నం: మండల కేంద్రంలోని కొత్త దేవాంగుల వీధికి చెందిన ఎర్ర రామారావు (64) ఉపాధి పనికి వెళ్తూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొత్త దేవాంగుల వీధికి చెందిన ఎర్ర రామారావు, అతని భార్య జయమ్మలు కలిసి వీధిలోని అందరితో పాటు సోమవారం ఉదయం నీలమణిదుర్గ ఆలయం సమీపంలో ఉన్న తాడి చెరువులో ఉపాధి పని కోసం ఇంటి నుంచి నడుచుకుంటూ బయల్దేరి వెళ్లాడు. అయితే కాకితోట వద్ద కడుపు నొప్పిగా ఉందని రామారావు కూర్చొనిపోవడంతో ఉపాధి కూలీలందరూ కలిసి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. అనంతరం ఆటోలో పాతపట్నం సీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే అతను అప్పటికే మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది తెలపడంతో భార్య జయమ్మ రోదన అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడికి కుమారుడు, కుమార్తు ఉన్నారు.