వియత్నాంలో గవర్నర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

వియత్నాంలో గవర్నర్‌ పర్యటన

Jun 3 2025 5:45 AM | Updated on Jun 3 2025 5:45 AM

వియత్నాంలో గవర్నర్‌ పర్యటన

వియత్నాంలో గవర్నర్‌ పర్యటన

భువనేశ్వర్‌: బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరి బాబు కంభంపాటి వియత్నాం వెళ్లిన విషయం విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం క్వాంగ్‌ నామ్‌ ప్రావిన్స్‌లోని ప్రసిద్ధ మై సన్‌ ఆలయ సముదాయాన్ని గవర్నర్‌ సందర్శించారు. ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు సాధించింది. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) సహాయంతో ఈ ప్రాంతం పునరుద్ధరణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ సందర్శన మరింత ప్రాముఖ్యతను జోడిస్తుంది.

మై సన్‌ వియత్నాం అత్యంత విలువైన సాంస్కృతిక ప్రదేశాలలో ఒకటి కావడం విశేషం. ఈ సముదాయంలో 4వ శతాబ్దం నాటి కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాచీన దేవాలయాలను చంపా రాజ్యం నిర్మించింది. ఆగ్నేయాసియా యొక్క ఉమ్మడి సాంస్కృతిక గతానికి కీలక చిహ్నాలుగా పరిగణిస్తారు.

ఈ సందర్శన పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్‌ భారత దేశం మద్దతుతో జరుగుతున్న పునరుద్ధరణ పురోగతిని ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సముదాయంలో పురాతన నిర్మాణాలను సంరక్షించేందుకు ఉపయోగిస్తున్న ప్రత్యేక పద్ధతుల్ని అధికారులు గవర్నర్‌కు వివరించారు. చుట్టూ పచ్చని పర్వతాలు, జరజర ప్రవహించే నీటి వాగుల మధ్య ఒక సుందరమైన లోయ పరిసరాల్లో మై సన్‌ ఆలయ సముదాయం నెలకొని ఉంది. ఇది 7వ, 13వ శతాబ్దాల మధ్య చంపా నాగరికతకు ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మై సన్‌ ఆలయ సముదాయంలో దాదాపు 70 ఆలయ నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా జీవ కళని ప్రతిబింబిస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన పద్ధతితో నిర్మించబడిన ఈ దేవాలయాలు శతాబ్దాలుగా బలంగా నిలిచి ఉండడం చరిత్రకారులు, వాస్తుశిల్పుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం చంపా రాజ్యం మరియు భారత దేశం, చైనా వంటి గొప్ప నాగరికతల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబింప జేస్తుంది. ఒడిశా గవర్నర్‌ పర్యటన భారత దేశం, వియత్నాం మధ్య సన్నిహిత సాంస్కృతిక బంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించడంలో భారత దేశం యొక్క నిరంతర పాత్రకు నిలువునా అద్దం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement