
అగ్రస్థానం లక్ష్యం
పాల ఉత్పాదనలో ..
భువనేశ్వర్: 2023–24 సంవత్సరంలో మన రాష్ట్రం 26.4 లక్షల మెట్రిక్ టన్నుల పాలను ఉత్పత్తి చేసిందని, రానున్న ఐదేళ్లలో దాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, పాల ఉత్పత్తి రాష్ట్రంగా ఒడిశా దేశంలో ఒక నమూనా స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. పాల సంపన్న ఒడిశా, ఆరోగ్యకరమైన ఒడిశా అనే నినాదంతో మనం అంతా కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక అభివృద్ధి శాఖ స్థానిక లోక్ సేవా భవన్ సమావేశ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రపంచ పాల దినోత్సవం – 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ఒడిశా పాల సమాఖ్య (ఓంఫెడ్) రైతులకు రూ.1 లక్ష ప్రమాద మరణ సహాయం, ఓంఫెడ్ పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం లీటరుకు రూ. 3 అదనంగా ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓంఫెడ్ బాల్టి పెరుగు, ఎ–2 పాలు, ఎ–2 నెయ్యి కొత్త ఉత్పాదనల్ని విడుదల చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కామధేను యోజన, ఆవు, దూడల పెంపకం, ఆవుల మందల భీమా, గడ్డి సాగు కోసం నగదు ప్రోత్సాహకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముఖ్యమంత్రి కామధేను యోజన కింద సుమారు 3 లక్షల మంది గోపాలకులకు రూ. 71 కోట్ల సహాయం అందజేశారు. రాష్ట్రంలోని 77 నమోదిత గోశాలలలో నిస్సహాయ గోవుల నిర్వహణ కోసం సంక్షేమ సంస్థలకు రూ. 10.5 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా మాట్లాడుతూ పాడి ఉత్పాదన రంగంలో మహిళల స్వావలంబన బలోపేతం అవుతుందన్నారు. మా మిషన్ శక్తి సహకారంతో సేంద్రీయ గత్తం ఉత్పత్తితో మహిళలు లక్ష పతి దీదీలుగా ఎదుగుతున్నారని తెలిపారు. రాష్ట్ర న్యాయ, నిర్మాణం, అబ్కారి శాఖ మంత్రి పృథ్వీ రాజ్ హరిచందన్ తన ప్రసంగంలో ఆవుల పెంపకం మరియు పాల ఉత్పత్తి సమాజంలోని ప్రతి స్థాయిలో ఉపాధిని పెంచడంలో సహాయపడుతుందన్నారు. దేశంలోని ప్రతి గ్రామం స్వావలంబన చెందితేనే దేశ ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కామధేను యోజన పాల ఉత్పత్తి రంగంలో విప్లవం తీసుకొచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయడానికి, ఒడిశాను పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక అభివృద్ధి, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల విభాగం మంత్రి గోకులానంద్ మల్లిక్ అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ వశిష్ట, పశు సంవర్ధక మరియు పశు వైద్య శాఖ డైరెక్టర్ విజయ్ అమృత కులంగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ పశు సంక్షేమ సంస్థల కార్మికులు, గోసంరక్షకులు, పశుసంవర్ధక శాఖ కార్మికులు పాల్గొన్నారు.
రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో పాల ఉత్పత్తి రెట్టింపు
రాష్ట్ర స్థాయిలో ప్రపంచ పాల దినోత్సవం
– 2025

అగ్రస్థానం లక్ష్యం

అగ్రస్థానం లక్ష్యం