
వియత్నాం నుంచి బుద్ధుని పవిత్ర అవశేషాల తరలింపు
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆధ్వర్యంలో వియత్నాం నుంచి భారత దేశానికి బుద్ధుని పవిత్ర అవశేషాల తరలింపు కోసం ప్రత్యేక ప్రతినిధి బృందం శుక్రవారం న్యూ ఢిల్లీకి బయలుదేరింది. జూన్ 2న న్యూ ఢిల్లీ నుంచి ఈ బృందం వియత్నాంకు వెళ్తుంది. ఐక్యరాజ్య సమితి వెసాక్ దినోత్సవాల సందర్భంగా భారతదేశం నుంచి వియత్నాంకు తీసుకెళ్లారు. ఏటా మే నెలలో పౌర్ణమి నాడు ఈ వేడుకలు ప్రారంభిస్తారు. ఈ ఏడాది మే 6 నుంచి 8 వరకు వెసాక్ వేడుకల సందర్భంగా వియత్నాంలో బుద్ధుని అవశేషాలు ప్రదర్శించారు. బుద్ధుని జననం, జ్ఞానోదయం, మరణం వరకు చోటు చేసుకున్న అపురూప ఘట్టాల స్మరణకు ప్రతీకగా వెసాక్ వేడుకలు నిర్వహిస్తారు. ప్రస్తుతం బుద్ధుని అవశేషాలను వియత్నాంలోని అనేక ప్రదేశాలలో ప్రదర్శిస్తున్నారు. బుద్ధ భగవానుడు తన మొదట ఉపన్యాసం ఇచ్చిన పవిత్ర స్థలం సారనాథ్ నుంచి అవశేషాలను ప్రత్యేక భారత వైమానిక దళ విమానంలో వియత్నాంకు తరలించారు. కేంద్ర బలహీన వర్గాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బౌద్ధ సన్యాసులు, సీనియర్ భారత అధికారుల బృందం ఆధ్వర్యంలో వీటిని వియత్నాం చేర్చారు. ఈ బృందంతో ది జర్నీ ఆఫ్ గౌతమ బుద్ధ‘ నృత్య నాటక ప్రదర్శన కోసం ప్రత్యేక భారతీయ సాంస్కృతిక బృందం హో చి మిన్ నగరం, హనోయ్ తదితర ప్రదేశాలలో బుద్ధుని జీవితం, బోధనలను చిత్రీకరించిన నాటకం ప్రదర్శించింది.
ఈ వేడుకలు జూన్ 2తో ముగియనున్నాయి. ఆ తర్వాత బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలు వియత్నాంలోని డా నాంగ్ నగరం నుంచి ప్రత్యేక భారత వైమానిక దళ విమానంలో భారత దేశానికి తిరిగి తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర గవర్నరు డాక్టరు హరి బాబు కంభంపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం బయల్దేరింది.
ఈ సందర్భంగా గవర్నర్ కంభంపాటి మాట్లాడుతూ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారత దేశానికి తిరిగి తీసుకు రావడం గౌరవప్రదమైన విషయమని, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వియత్నాంతో మన ఉమ్మడి నాగరిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
గవర్నర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పయనం