అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి

May 2 2025 1:26 AM | Updated on May 2 2025 1:26 AM

అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి

అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి

● బహుళార్ధసాధక కార్మికుల విశ్రాంతి గదుల ప్రారంభంలో సీఎం మాఝి ● ఒడిశా శ్రామిక్‌ సాథీ మొబైల్‌ యాప్‌ ప్రారంభం

భువనేశ్వర్‌: ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నామని, ప్రధానంగా అట్టడుగు స్థాయి ప్రజలకు ప్రభుత్వ సేవలు అంకితం చేస్తున్నామని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ప్రకటించారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి ఇదే దృక్పథంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఓయూఏటీ వ్యవసాయ విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా నగరంలో 2 బహుళార్ధసాధక కార్మికుల విశ్రాంతి సముదాయాల్ని ప్రారంభించారు. స్థానిక డుమ్‌డుమా మరియు కల్పనా ప్రాంతాల్లో వీటిని ప్రారంభించారు. ఈ ప్రాంగణాల్లో కార్మికులకు తాత్కాలిక ఆశ్రయ సౌకర్యాలతో పాటు సురక్షిత తాగు నీరు, మరుగుదొడ్లు, పార్కులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో కటక్‌, రౌర్కెలా, సంబలపూర్‌, కెంజొహర్‌, బరంపురం వంటి ఇతర పట్టణ ప్రాంతాలలో కార్మికుల నిరీక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్మికులు అకాల మరణానికి గురైతే అందజేసే మరణ పరిహారం మొత్తం పరిమితి పెంచినట్లు తెలిపారు. ఇకపై సాధారణ మరణానికి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పరిహారం పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 47 లక్షల మంది నిర్మాణ కార్మికులు నమోదు చేసుకున్నారు. వీరంతా వివిధ పథకాల కింద రూ.3,951 కోట్లకు పైగా సహాయం పొందారని వివరించారు. తాజాగా 4 లక్షలకు పైగా నిర్మాణ కార్మికులు నమోదు చేసుకుని రూ. 370 కోట్లకు పైగా సహాయం పొందారని తెలిపారు.

యాప్‌ ప్రారంభం..

మే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది అర్హులైన నిర్మాణ కార్మికులకు ఒకేసారి కొత్త గుర్తింపు కార్డుల్ని సీఎం జారీ చేశారు. వీరిలో అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ. 40 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయం అందజేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వివిధ సేవలు కార్మికులకు చిటికెలో లభ్యం అయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఒడిశా శ్రామిక్‌ సాథీ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. దీనివల్ల కార్మికులు ఇంటి నుంచే వివిధ సేవలను సులభంగా, సౌకర్యవంతంగా పొందగలుగుతారని సీఎం చెప్పారు. నిర్మాణ కార్మికులకు ఆన్‌లైన్‌ వర్కర్‌ రిజిస్ట్రేషన్‌, పునరుద్ధరణ, సహాయం కోసం దరఖాస్తు వంటి సేవలను పొందడంలో ఈ మొబైల్‌ యాప్‌ ఎంతో సహాయపడుతుందని తెలిపారు. వలస కార్మికులను గుర్తించి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఒడియా వలస కార్మికుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లోక్‌సభ సభ్యురాలు, ఎమ్మెల్యే, కార్మిక–ఉపాధి శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement