
3న కేఎల్యూ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథివర్మ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులో ఉన్న యూనివర్సిటీ అడ్మిని స్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది రూ.75 లక్షల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించటం గర్వకారణమన్నారు. రూ.58 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్తో పాటు తమ విద్యార్థులు అనేక రికార్డ్స్ సాధించారని చెప్పారు. ఈ ఏడాది 500కు పైగా కంపెనీలు యూనివర్సిటీని సందర్శించి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాయని, ఆరు వేల మందికి పైగా విద్యార్థులు కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ అందుకున్నారని, 4700 మంది విద్యార్థులు వివిధ ప్యాకేజీలలో ప్లేస్మెంట్స్ పొందారని వివరించారు. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక ప్యాకేజీలను 35 మందికి పైగా విద్యార్థులు దక్కించుకున్నారన్నారు. సూపర్ డ్రీమ్ కంపెనీలలో 150 మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారని చెప్పారు. టీసీఎస్లో ఒకేరోజు 617 మంది, కాప్ జెమినీలో 493 మంది, టెక్ మహేంద్రలో 381 మంది ఆఫర్స్ పొందారన్నారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో అంతర్జాతీయ ప్లేసెమెంట్స్ దక్కించుకున్నారన్నారు. తమ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందరిలో ఉత్సాహన్ని నింపేందుకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ విజయోత్సవాన్ని మే మూడో తేదీన వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డీన్ ఎన్.బి.వి.ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, సిస్కో వంటి కంపెనీలతో పాటు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అతిథులుగా మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కంపెనీ ప్రతినిధులు రూ.75 లక్షల ప్యాకేజీ దక్కించుకున్న కేఎల్యూ విద్యార్థి