● భూమి కాజేసేందుకు కుట్రచేశారన్న ఆరోపణ
● పట్టా పాస్పుస్తకం తిరిగి ఇచ్చేయాలని డిమాండ్
ఆర్మూర్టౌన్: జంటహత్య కేసులో నిందితుడైన చేపూర్కు చెందిన బండి గంగాధర్ ఆదివారం ఆర్మూర్ పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, గంగాధర్ భూమిని కాజేసేందుకు కొందరు కుట్రచేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం పెర్కిట్లోని విద్యానగర్కు చెందిన ఓ న్యాయవాది ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి... 15రోజుల క్రితం చేపూర్లో కులసంఘం సభ్యులతో సమావేశమైన సమయంలో తాను ఓ న్యాయవాదికి రూ.5లక్షలు ఇవ్వాల్సి ఉందని గంగాధర్ తెలిపాడు.
ఇందుకోసం భూమిని విక్రయించేందుకు సదరు లాయర్ సమక్షంలోనే చేపూర్కు చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిత్వంతో రూ.5లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఈ విషయం కొనుగోలుదారు ప్రతికల్లో ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా భూమిని కాజేసేందుకు కుట్ర చేయడంతోనే గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదని వారు ఆందోళన చేశారు. లాయర్ వద్ద ఉన్న పట్టాపాస్పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్హెచ్వో రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.