
ధాన్యం తిప్ప పంపిన మిల్లర్
నర్సాపూర్(జి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు అధికారులు తడిచిన ధాన్యం కొంటామని చెబుతున్నారు. మరోవైపు మిల్లర్లు ధాన్యం సరిగా లేదని తిప్పిపంపుతున్నారు. మండలంలోని డొంగుర్గాంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లను చేపట్టారు. తురాటి గ్రామానికి చెందిన గొర్ల ప్రవీణ్కు చెందిన ధాన్యాన్ని ఈనెల 27న తూకం వేసి ట్రాక్టర్లలో కుంటాల రైస్ మిల్లుకు తరలించారు. ట్రక్ షీట్లో మాత్రం రైతు, రైస్ మిల్లు పేర్లు, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల వివరాలు ఏమీ లేకుండా తరలించారు. ఇలా తరలించిన ధాన్యాన్ని రెండు మూడు రోజుల తర్వాత మిల్లర్లు తేమశాతం సరిగా లేదనే కారణంతో గురువారం వెనక్కి పంపించారు. దీంతో సదరు రైతు చేసేదేమీ లేక మళ్లీ ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు.