
జొన్న రైతుల తిప్పలు
కుభీర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజులుగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం జొన్నలు తెచ్చిన రైతులు వర్షంలో ఇబ్బంది పడ్డారు. మార్కెట్ యార్డు నుంచి తెలంగాణతల్లి చౌక్ వరకు రోడ్డువెంట వాహనాలు బారులుతీరాయి. బుధవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని అధికారులు చెప్పడంతో మంగళవారం భారీగా రైతులు జొన్నలు తీసుకువచ్చారు. యార్డులో ఇప్పటి వరకు సుమారు 28 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేశారు. మంగళవారం లారీలు రాక బస్తాలతో అక్కడే ఉండడంతో జొన్నలతో వచ్చిన వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. వర్షం కారణంగా టార్పాలిన్లు కప్పి ఉంచారు. జొన్నల కొనుగోళ్లు జూన్ 30 వరకు చేస్తామని గతంలో చెప్పారు. జూన్ 17 వరకు టోకెన్లు జారీచేశారు. తీరా ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఎత్తేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.