ED Vs Kejriwal: ‘కేజ్రీ’వాల్‌ను వదలని ఈడీ.. | Sakshi
Sakshi News home page

ED Vs Kejriwal: ‘కేజ్రీ’వాల్‌ను వదలని ఈడీ..

Published Thu, Feb 22 2024 11:26 AM

ED Issues Seventh Summon To Delhi CM Kejriwal Over Liquor Case - Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వదలడం లేదు. లిక్కర్‌ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు తాజాగా ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న విచారణకు రావాలని తాజా సమన్లలో పేర్కొంది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి ఈడీ.. మరోసారి కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా, ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్‌కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. 

దీంతో, తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులకు కేజ్రీవాల్‌ ఈసారైనా స్పందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపించినా కేజ్రీవాల్‌ హాజరు కాలేదు.

Advertisement
Advertisement