
మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు : ఎస్పీ
నారాయణపేట: జిల్లాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. 2023 నుంచి 2025 వరకు పలు సామాజిక మాధ్యమాల్లో ఇతర మతాలను కించపరుస్తూ 20 పైగా పోస్టులు చేసిన యువకులకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల్లో ఒకరి మతాన్ని మరొకరు ద్వేషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల మత ఘర్షణలకు దారితీస్తుందన్నారు. అలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఇకపై మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయకూడదని యువకులకు సూచించారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇతరులకు షేర్ చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు.
ఆటో కార్మికులపై
వేధింపులు ఆపాలి
నారాయణపేట రూరల్: ఆటో కార్మికులపై ఆర్టీఓ, పోలీసుల వేధింపులు ఆపాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, రాము డిమాండ్ చేశారు. టీయూసీఐ ఆధ్వర్యంలో గురువారం ఆటో కార్మికులు ఆర్టీఓ కార్యాలయ ముట్టడి చేపట్టారు. ముందుగా జిల్లా కేంద్రంలోని సింగారం గేట్ నుంచి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటోలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేదని వేధించడంతో పాటు ప్రతి చిన్న విషయానికి రూ.వేలల్లో జరిమానాలు విధిస్తుండటంతో ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొట్టకూటి కోసం ఆటోలు నడుపుతున్న వారిని వేధింపులకు గురిచేయడం తగదన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటోలకు గిరాకీ తగ్గి.. డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ. 12వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు జిల్లాకేంద్రంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాశీనాథ్, నర్సింహులు, నారాయణ, సాదిక్, సలీం, ప్రశాంత్, తాయప్ప, అంజి పాల్గొన్నారు.
జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గత నెల 26వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్ సెలక్షన్ ఫలితాలను గురువారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రస్థాయికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 18 మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. ఇందులో పది మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారని, వీరు హైదరాబాద్లోని హకీంపేట క్రీడా పాఠశాలలో నేడు (శుక్రవారం), శనివారం రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న వారు పాస్పోర్ట్ ఫోటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహశీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్తో శుక్రవారం(నేడు) మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట స్పోర్ట్ స్కూల్లో రిపోర్ట్ చేయాలని డీవైఎస్ఓ సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
ఎంపికై న విద్యార్థుల వివరాలు: కొత్తపల్లి ప్రేమ్కుమార్ (మహబూబ్నగర్), ముడావత్ యశ్వంత్ (బాలానగర్), జి.రిశి తేజ్, బెక్కరి వర్షిత్, కట్ల ఆదిత్య (మహబూబ్నగర్), పి.మోక్షిత్ (మహమ్మదాబాద్), కె.జయంత్ మణి (కోడ్గల్), ఎ.శౌర్య యాదవ్ (మహబూబ్నగర్), బి.నందీశ్వర్ (హన్వాడ), మద్దు పార్థ (జడ్చర్ల), బడావత్ వరలక్ష్మి (నవాబ్పేట), పాత్లవత్ భవ్యశ్రీరాథోడ్, వింజమురి భవ్యశ్రీ (కోయిలకొండ), వనం ఆరాధ్య (మూసాపేట), కె.సహస్ర (గండేడ్), ఎన్.హరిక (దేవరకద్ర), గోద లఖిత (మిడ్జిల్), కుర్వ ప్రణవి (దేవరకద్ర).

మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు : ఎస్పీ