
ఊరించి.. ఉసూరుమనిపించి!
వర్షాలు కురిస్తేనే విత్తనాలు పెట్టాలి
ప్రస్తుత పరిస్థితుల్లో రెండు వర్షాలు కురిసిన తరువాతనే రైతులు పత్తి విత్తనాలు పెట్టుకోవాలి. వర్షాలు పడకుండా విత్తనాలు పెట్టుకుంటే అవి మాడిపోయే ప్రమాదం ఉంటుంది. రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకుని నష్టపోవద్దు.
– పాల్వాయి శ్రవణ్కుమార్, డీఏఓ
నల్లగొండ అగ్రికల్చర్ : వర్షాలు ముఖం చాటేసాయి. ఈ ఏడాది వర్షాలు ముందస్తుగానే వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం.. అందుకు తగ్గట్టుగానే వారం క్రితం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వారంలో వర్షం కురవకపోతే మొలకలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం క్రితం కురిసిన వాన..
జిల్లాలో గత నెల చివరి వారంలోనే రెండు రోజుల పాటు జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురిసాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమయ్యారు. దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను పెట్టుకునేందు సిద్ధంగా ఉన్నారు. అప్పటికే దుక్కులు దున్నుకున్నవారు పత్తి విత్తనాలు పెట్టారు. బోరు బావుల కింద వరినార్లు కూడా పోసుకున్నారు. ఈ నెల 8న ఆదివారం మృగశిర కార్తి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రైతులు ఏరువాక ప్రారంభించనున్నారు. కానీ ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో ఇప్పటికే విత్తిన పత్తి విత్తనాలు మాడిపోయే ప్రమాదం ఉంది.
మారిన వాతావరణం
వానాకాలంలో ప్రస్తుతం వాతావరణం వేసవిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయింది. ఉక్కపోత, ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే తప్ప వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు సాధారణ వర్షం కూడా కురవలేదు. కేవలం కట్టంగూరు మండంలో అధిక వర్షం కురవగా.. నకిరేకల్ మండలంలో సాధారణ వర్షపాతం నమొదైంది. మిగతా 14 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. 17 మండలాల్లో వర్ష ప్రభావమే కనిపించలేదు. దీంతో వర్షాల కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఫ కనిపించని చినుకు జాడ
ఫ ప్రారంభమైన వానాకాలం సీజన్
ఫ వాన కోసం రైతుల ఎదురుచూపులు