
అట్టహాసంగా బడిబాట ప్రారంభం
నల్లగొండ : బడిబాట కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొదటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామసభలు నిర్వహించారు. అంతటా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, గ్రామ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పిల్లల తల్లిదండ్రులతో సభ నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిపై చర్చించడంతోపాటు బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించే విధంగా అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభమైందని.. నాణ్యమైన విద్యను అందిస్తామన్న భరోసాను కల్పించారు.
ప్రభుత్వ బడి – చదువుల గుడి : డీఈఓ
కనగల్ : ప్రభుత్వ బడి–పేద పిల్లల చదువుల గుడి అని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం కనగల్ మండలంలోని దర్వేశిపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు, నోట్పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, రాంబాబు పాల్గొన్నారు.
ఫ తొలిరోజు జిల్లా అంతటా గ్రామసభలు

అట్టహాసంగా బడిబాట ప్రారంభం