
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్
నల్లగొండ : మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన చేయనుంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో హాలియా, ఆలేరు మున్సిపాలిటీల్లో కూడా వార్డుల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ మున్సిపాలిటీల్లో 12 చొప్పున వార్డులు ఉన్నాయి. పునర్విభన ద్వారా ఆ వార్డుల సంఖ్య మారనప్పటికీ.. వార్డు విస్తీర్ణంలో కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. దీనిపై ఈనెల 4వ తేదీన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు లేఖలు పంపడంతో పాటు ప్రజలకు మాత్రం పబ్లిక్ నోటీసు ఇవ్వనున్నారు. 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాత పూర్వకంగా సలహాలు, అభ్యంతరాలు తీసుకోనున్నారు. 12 నుంచి 16వ తేదీవరకు వచ్చిన సూచనలు, అభ్యంతరాలు పరిశీలించి పరిష్కరిస్తారు. 17, 18 తేదీల్లో ఆ తుది జాబితా కలెక్టర్కు పంపుతారు. 19న కలెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు నివేదిక అందిస్తారు. 20న సీడీఎంఏ ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతుంది. 21న తుది నోటిఫికేషన్ జారీ కానుంది.
గ్లోబల్ యూత్ సమ్మిట్కు వలంటీర్లు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : కర్నాటక రాష్ట్రంలోని మంగళూరులో ఈనెల 5,6 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ యూత్ సమ్మిట్కు ఎంజీ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం వలంటీర్లు మనీషా, సిరివెన్నెల ఎంపికై నట్లు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త పసుపుల మద్దిలేటి తెలిపారు. గ్లోబల్ యూత్ సమ్మిట్కు ఎంపికై న విద్యార్థులు మనీషా, సిరివెన్నెలను మంగళవారం యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీల, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
శానిటేషన్ మెటీరియల్ కాంట్రాక్ట్కు టెండర్ల ఆహ్వానం
నల్లగొండ : జిల్లాలోని 868 గ్రామాల్లో పారిశుద్ధ పనులు చేపట్టడానికి అవసరమైన శానిటేషన్ మెటీరియల్ను సరఫరా చేయడానికి ఆసక్తి గల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో టెండర్లు సమర్పించాలని సూచించారు. 7వ తేదీ సాయంత్రం 4 గంటల టెండర్లను తెరుస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా పంచాయతీ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జి.మునేష్ను, లేదా 9014643085 ఫోన్ నంబన్లో కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
క్షేత్రపాలకుడికి క్షీరాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతోపాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి.