
నాణ్యమైన విత్తనం రైతు నేస్తం
తిప్పర్తి : నాణ్యమైన విత్తనాలు రైతు నేస్తాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య అన్నారు. రానున్న రెండు మూడేళ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళవారం తిప్పర్తి రైతు వేదికలో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతులకు ఫౌండేషన్ వరి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 430 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో తయారు చేసిన విత్తనాలను రాష్ట్రంలోని 11వేల రెవెన్యూ గ్రామాల్లో 40 వేల మంది రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు మంచి దిగుబడి సాధిస్తే.. వచ్చే సీజన్కు ఇతర రైతులకు కూడా సరఫరా చేయవచ్చన్నారు. యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు పండించాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫౌండేషన్ విత్తనాలను జిల్లాలో 564 రెవెన్యూ గ్రామాల్లో ముగ్గురికి చొప్పున పంపిణీ చేస్తామన్నారు. ఈ విత్తనాలు రైతులకు మేలు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జూకురి రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, మాజీ జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, తహసీల్దార్ పరుశురాం, ఏఓ సన్నిరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ జానయ్య