
Actress Bhavana Menon Opens Up On Assalut Case After 5 Years: ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్స్టార్ దిలీప్ కుమార్పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ భావన స్పందించింది. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్టును షేర్ చేసింది.
'బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానా అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను.
న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. కాగా హీరోయిన్ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, నిప్పు వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.