వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

Jul 5 2025 6:10 AM | Updated on Jul 5 2025 6:10 AM

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

ఉమ్మడిజిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గు రు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఒకరు, మద్యంమత్తులో మరో యువ కుడు, అనారోగ్యంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

పురుగుల మందు తాగి ఒకరు..

లోకేశ్వరం: మండలంలో ని రాజూర గ్రామానికి చెందిన తోట దేవన్న(52) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆశోక్‌ కథనం ప్రకారం.. దేవన్న కొంతకాలంగా మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా తిరుగుతుండేవాడు. గురువారం రాత్రి అతి గా మద్యం తాగి ఇంటికి రావడంతో ఈ విషయమై భార్య హేమలత, కుమారుడు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన దేవన్న అదేరాత్రి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో నిర్మల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సతీశ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మద్యం మత్తులో యువకుడు..

బజార్‌హత్నూర్‌: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై లింబాజీ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం.. మండల కేంద్రంలోని ముత్యంపేటకు చెందిన సుకుల్‌ నారాయణ–లక్ష్మి దంపతుల కుమారుడు సుకుల్‌ తరుణ్‌(23) ఓ ఫర్టిలైజర్‌ షాపులో పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బహిర్భుమికని గురువారం మధ్యాహ్నం చెరువుకట్ట వైపు వెళ్లి తిరిగిరాలేదు. అక్కడ పురుగుల మందు తాగి కిందపడిపోయి ఉన్నాడని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని అతన్ని పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

అనారోగ్యంతో మహిళ..

లింగాపూర్‌: అనారోగ్యంతో బాధపడుతున్న మహి ళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గంగన్న కథనం ప్రకారం.. మండలంలోని జాముల్‌దర గ్రామానికి చెందిన సలాం సరస్వతీ(33) గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రుల్లో చూపించిన నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన భర్త, కుటుంబ సభ్యులు ఆమెను జైనూర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు పంపించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement