జన్నారం: జన్నారం అటవీ డివిజన్ కార్యాలయం సిబ్బంది ఖాళీలతో కొట్టుమిట్టాడుతోంది. 20నెలలుగా ఫారెస్టు డివిజనల్ అధికారి(ఎఫ్డీవో) పోస్టు ఖాళీగా ఉండడంతో అడవిపై పర్యవేక్షణ కొరవడుతోంది. జన్నారం ఎఫ్డీవోగా నాలుగున్నరేళ్లు పని చేసిన సిరిపురం మాధవరావు 2023 అక్టోబర్లో డిప్యూటీ కన్జర్వేటర్గా పదోన్నతిపై ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్సింగ్కు ఇంచార్జి ఎఫ్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో నిత్యం ప్రభుత్వ, కార్యాలయ పనులతో బిజీగా ఉండే ఆయన అప్పుడప్పుడు డివిజన్కు వచ్చి వెళ్తుంటారు. ఎఫ్డీవోతోపాటు జన్నారం ఫారెస్టు రేంజ్ అధికారి పోస్టు ఖాళీగానే ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించి కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సస్పెన్షన్ వేటు పడుతోంది. గత ఏడు నెలల క్రితం దొంగపల్లిలో ఫర్నిచర్ దొరకడంతో అక్కడి సెక్షన్ అధికారిని సస్పెండ్ చేశారు. ఆరు నెలల క్రితం పైడిపల్లి బీట్లో చెట్లు నరికివేతకు గురయ్యాయని సెక్షన్, బీట్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇటీవల జన్నారం రేంజ్ పరిధి అటవీ భూమిలో గుడిసెల తొలగింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ రేంజ్అధికారి, బీట్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
వెక్కిరిస్తున్న ఖాళీల కొరత
జన్నారం అటవీ డివిజన్లో ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట అటవీ రేంజ్లున్నాయి. ఇందులో 14 సెక్షన్లు, 40 బీట్లు ఉన్నాయి. జన్నారం ఎఫ్డీవో పోస్టు 20 నెలలుగా ఖాళీగా ఉండగా, సూపరింటెండెంట్, డీఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ముగ్గురే సిబ్బంది పని చేస్తున్నారు. జన్నారం రేంజ్ అధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇంచార్జి రేంజ్ అధికారి హఫీజొద్దీన్ బదిలీపై వెళ్లడంతో తాళ్లపేట్ రేంజ్ అధికారి సుష్మారావును ఇంచార్జిగా నియమించారు. కవ్వాల్ సెక్షన్ అధికారి, జన్నారం డీఆర్వో ఇంచార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. డివిజన్లో 40 బీట్లకు గాను 15 బీట్ అధికారి పోస్టుల్లో ఇంచార్జీలే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల సెక్షన్ అధికారులు ఇంచార్జీ బీట్ అధికారులుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖాళీల కారణంగా ఒక్కో బీట్, సెక్షన్ అధికారికి మూడు బీట్లు ఇంచార్జీగా ఇవ్వడంతో పని భారం పెరిగి సక్రమంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో బీట్, సెక్షన్ అధికారికి ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడం వల్ల అన్ని ప్రాంతాల్లో తిరుగలేకపోతున్నారు. గతంలో ఎంస్ట్రైబ్ సాఫ్ట్వేర్ ద్వారా అధికారి పనితీరు గమనించేవారు. ప్రతీరోజు బీట్ అధికారి తన బీట్ పరిధిలో ఎంస్ట్రైబ్ ప్రారంభించినప్పుడు ఫొటో తీసి అప్లోడ్ చేసేవారు. అనంతరం బీట్లో ఎంతదూరం తిరిగారు, పర్యవేక్షణ విధానంపై సాఫ్ట్వేర్ ద్వారా ఉన్నత అధికారులు గమనించేవారు. ప్రస్తుతం ఆ సాఫ్ట్వేర్ను వాడడం లేదని తెలుస్తోంది. సిబ్బంది కొరత వల్ల కలప స్మగ్లింగ్ పెరిగే అవకాశాలున్నాయి.
ఉన్నత అధికారుల దృష్టికి
తీసుకెళ్లాం
జన్నారం అటవీ డివిజన్లో ఖాళీలు ఉన్న విషయం వాస్తవమే. కొత్తవాళ్లు వచ్చినా ఇంకా కొన్ని చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నూతన నియామకాలు పొందిన వారిని ఇక్కడికి పంపించే ఆలోచనలో ఉన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో భర్తీకి కృషి చేస్తాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం.
– శివ్ ఆశిష్సింగ్, జిల్లా అటవీ అధికారి
ఇద్దరు అదనపు కలెక్టర్లూ లేరు
పలు శాఖల్లోనూ అదనపు బాధ్యతలే అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై ప్రభావం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కీలక శాఖల్లో ఉన్నతాధికారుల స్థానాల ఖాళీలతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతోంది. జిల్లాలో ఇప్పటికే పలు శాఖల ఉన్నతాధికారులు, ఇతర కింది స్థాయి సిబ్బంది కొరత నెలకొంది. గత ఏడాది జూన్లో జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) రాహుల్ భద్రాచలం ఐటీడీఏ పీవోగా బదిలీ అయ్యారు. గత నెల 31న అదనపు కలెక్టర్(రెవెన్యూ) మోతీలాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవీందర్రెడ్డి ఉద్యోగ విరమణ పొందడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లా అదనపు కలెక్టర్ల స్థానంలో అదనపు బాధ్యతలను కలెక్టర్ నేరుగా పర్యవేక్షించాల్సి వస్తోంది. అంతకుముందు నుంచే జిల్లా రెవెన్యూ అధికారిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్గా అన్ని శాఖలను పర్యవేక్షిస్తూ.. నిత్యం బిజీగా గడుపుతుండగా అదనపు కలెక్టర్ల బాధ్యతలతో మరింత పనిభారం పెరగనుంది. అంతేగాక రెవెన్యూ, స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లు లేక పర్యవేక్షణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ప్రజాప్రతినిధులు లేక అధికారులే పరిపాలన బాధ్యతలు చేపడుతున్నారు. వీరితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. తమ పరిధిలో ఉన్న విధులతోపాటు ప్రత్యేక అధికారుల విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. జిల్లా వైద్యారోగ్య, కార్మిక, దేవాదాయ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, బీసీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ మార్కెటింగ్ ఏడీ, తూనికలు, కొలతల శాఖల అధికారులు పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లో ఉన్నారు.
పథకాల అమలులో తలమునకలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టం అమలు, వానాకాలం సీజన్ అప్రమత్తత, తదితర పథకాలు, అభివృద్ధి పనులు కీలకంగా ఉన్నాయి. ఆయా శాఖల్లో అధికారుల కొరతతో పురోగతిపైన, పర్యవేక్షణలో జాప్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు పంచాయతీరాజ్, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల్లోనూ కింది స్థాయిలో సరిపడా సిబ్బంది లేరు. దీంతో క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి అదనపు కలెక్టర్లతో సహా ఇతర శాఖల్లో ఖాళీలు లేకుండా అధికారులతో భర్తీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఎఫ్డీవో, ఎఫ్ఆర్వో, బీట్ అధికారులూ
ఇంచార్జీలే..
‘అటవీ’పై పర్యవేక్షణ కరువు
‘అటవీ’పై పర్యవేక్షణ కరువు