
‘చేయి’ కలపని నేతలు
● కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ● ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య సఖ్యత కరువు ● జిల్లా పార్టీలో నాయకుల్లో ఎవరికి వారే.. ● బహిరంగంగానే దూషణలు, కొట్లాటలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా అధికార ‘హస్తం’ పార్టీలో నాయకుల చేతులు కలవడం లేదు. జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఖానాపూర్ పరిధిలోని జన్నారం మండలం ఉంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఢిల్లీ నుంచి గాంధీ భవన్ వరకు ఉన్న నాయకులు పదే పదే చెబుతున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే ఐక్యంగా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీతో సహా ఎవరూ ఎక్కడా చేయి కలపని పరిస్థితి ఉంది. ‘గడ్డం’ కుటుంబ సభ్యులైన ఎమ్మెల్యేలు వినోద్, వివేక్, ఎంపీ వంశీకృష్ణలతో ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావుకు వైరం కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ విభేదాలు బయటపడ్డాయి. లోక్సభ ఎన్నికల వేళ కలిసి పని చేసినా ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. మంత్రి పదవి పోటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు పోటాపోటీగా ఉన్నారు. ఇక ప్రభుత్వ, పార్టీ కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యేలు ఒక్కటిగా పని చేసిన దాఖలాలు లేవు. డీసీసీ కార్యక్రమాలు సైతం మంచిర్యాలకే పరిమితం అవుతున్నాయి. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వర్గం, మరో వర్గం అన్నట్లుగా ఉంది. ఎవరికి వారే అన్న తీరుతో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళం నెలకొంది.
కొట్లాటలు..
ఇటీవల సంస్థాగత ఎన్నికల సమయంలో నాయకులు ఒకరినొకరు బాహాబాహీకి దిగారు. చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే నాయకుల మధ్య గొడవలు జరిగాయి. దీనిపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. ఆ తర్వాత కూడా ఒకరిపైనొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
● మందమర్రి పట్టణంలో ఇద్దరు పార్టీ నాయకులు ఘర్షణ పడగా.. పంచాయితీ ఎమ్మెల్యే వివేక్ వద్దకు చేరింది.
● ఇటీవల మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు ఎంపీ వంశీకృష్ణకు మద్దతుగా సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎదురైన అనుభవాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి లేఖ అందజేశారు. స్థానిక కాంగ్రెస్ యువజన నాయకులు నిరసన చేపట్టొద్దంటూ వాగ్వాదం చేసుకున్నారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలుగా ఒకరిపైనొకరు వాదనలు చేసుకోగా పోలీసులు చెదరగొట్టారు.
● కాసిపేట మండలం దేవాపూర్ సిమెంటు ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ పార్టీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో విక్రమ్రావును అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచే మరో అభ్యర్థి మంచిర్యాల ఎమ్మెల్యే సోదరుడు సత్యపాల్రావు బరిలో ఉండనున్నారు. ఒకే పార్టీ నుంచి వేర్వేరు అభ్యర్థులు బరిలోకి దిగుతుండడం చర్చనీయాంశంగా మారింది.