
తూనికలు, కొలతల్లోనూ.. ఇంచార్జే..!
పాతమంచిర్యాల: జిల్లా తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీలు చేసే వారు లేక ధరలు, తూకాల్లో వ్యత్యాసాలతో మోసపోతున్నారు. వ్యాపారుల అవినీతి, మోసాలు అరికట్టడంలో ఈ శాఖ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. మోసాలకు పాల్పడిన వారికి జరిమానా విధించడమే కాకుండా దుకాణాల లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తారు. జిల్లా కార్యాలయంలో ఒక ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, అటెండర్, చౌకిదార్(నైట్ వాచ్మెన్) పోస్టులు ఉండాలి. కానీ ప్రస్తుతం ఇంచార్జి ఇన్స్పెక్టర్(జిల్లా తూనికలు, కొలతల అధికారి), అటెండర్ మాత్రమే ఉన్నారు. దీంతో వ్యాపార సంస్థల్లో తనిఖీలు సక్రమంగా జరగడం లేదు. ఏడాదిలో రెండు మూడుసార్లు అక్కడక్కడ తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులకు జరిమానా విధిస్తున్నారు. ఇక్కడి ఇంచార్జి ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ పెద్దపల్లి జిల్లాలో రెగ్యులర్ అధికారి కాగా.. ఇక్కడ నాలుగేళ్లుగా ఇంచార్జిగా కొనసాగుతున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శంకర్ పదోన్నతిపై బదిలీ అయ్యారు. కార్యాలయంలో అటెండర్ ఒక్కరే విధులు నిర్వర్తిస్తుండగా.. ఇంచార్జి ఇన్స్పెక్టర్ తనకు వీలైన సమయంలో వచ్చి తనిఖీలు చేస్తుంటారు. తూనికలు, కొలతల అధికారులు ప్రతీ ఏడాది వ్యాపారుల తూకాల యంత్రాలను పరిశీలించి సీల్, రెండేళ్లకు ఒకసారి తూకం రాళ్లు, కాంటాలను పరిశీలించి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ముద్రలు లేకుండా వ్యాపారాలు చేస్తూ పట్టుబడితే కాంటాలను సీజ్ చేసి జరిమానా విధిస్తారు. పెట్రోల్ పంపులు, వేబ్రిడ్జిలు, కొనుగోలు కేంద్రాలు, వస్త్ర, వ్యాపార సంస్థలు, నిత్యావసర వస్తువుల అమ్మకాలు సాగించే దుకాణాలు తదితర వాటిలో తనిఖీ అధికారాలు కలిగి ఉంటారు. దీంతో వినియోగదారులు నాణ్యమైన వస్తువులు, సేవలు పొందే అవకాశం ఉంది. మోసాలపై ఫిర్యాదు చేయాలంటే అధికారులు అందుబాటులో ఉండడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో
రెగ్యులర్ అధికారులను నియమించాలని కోరుతున్నారు.
తనిఖీల్లో జరిమానాలు
సంవత్సరం కేసులు రూ.లు
2023–24 159 7,88,000
2024–25 191 9,01,500