జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో

Jun 2 2025 12:41 AM | Updated on Jun 2 2025 12:41 AM

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో

ధరూరు/ దోమలపెంట/ మదనాపురం/ ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం మరింత తగ్గి.. 14 వేల క్యూసెక్కులు వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో తెరిచి ఉంచిన క్రస్టు గేట్లను మూసివేయడంతోపాటు నీటి కొరత కారణంగా జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. అయితే నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 84 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 834 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.759 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెప్పారు.

శ్రీశైలానికి 2,231 క్యూసెక్కులు..

జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం నిలిచిపోవడంతో శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సుంకేసుల నుంచి 2,231 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 831.1 అడుగుల వద్ద 50.6888 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885.0 అడుగుల వద్ద 215.8070 టీఎంసీలు.

రామన్‌పాడులో 1,017 అడుగులు..

మదనాపురం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్రమట్టానికి పైన 1,021 అడుగులకు గాను 1,017 అడుగులకు వచ్చి చేరింది. జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. ఇదిలా ఉండగా రామన్‌పాడు ఎడమ కాల్వ ద్వారా 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఏఈ వరప్రసాద్‌ తెలిపారు.

విద్యుదుత్పత్తి నిలిపివేత

జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇన్‌ఫ్లో లేని కారణంగా విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. అంతకు ముందు ఉదయం ఎగువలో 4 యూనిట్ల ద్వార 156 మెగావాట్లు, దిగువలో 3 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు ఉత్పత్తి చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement