
కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలమూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో భారత్ అవతరించిందని, వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సదస్సులో ఆయన మాట్లాడారు. సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాత్మకంగా నిర్ణయాలతో మోదీపాలన సాగుతుందన్నారు. ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలతో మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవ ఘనంగా చేపట్టాలన్నారు. ఆపరేషన్ సిందూర్ ఒక గొప్ప విజయం అని, సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పర్యావరణం రక్షించడానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతతో ఒక మొక్క నాటాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, సత్యం, కృష్ణవర్ధన్రెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, గంగన్న పాల్గొన్నారు.