భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ వేడుకలు

Jun 8 2025 12:44 AM | Updated on Jun 8 2025 12:44 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ వేడుకలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: బక్రీద్‌ (ఈద్‌ ఉల్‌ అజ్‌హా) పండుగను ముస్లింలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లాకేంద్రంలోని రహెమానియా ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు ఈద్‌ ప్రార్థనలు చేశారు. జామియా మసీదు ప్రధాన ఇమామ్‌ మౌలానా మహ్మద్‌ హాఫిజ్‌ ఇస్మాయిల్‌ ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. పండుగ ప్రాశస్త్యాన్ని ఖుత్‌బా రూపంలో వివరించారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. బక్రీద్‌ను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్‌ ముబారక్‌ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరపున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. త్యాగాన్ని, క్షమను గుర్తుచేస్తూ స్వార్థాన్ని త్వజించాలన్నదే బక్రీద్‌ పండుగ మనకు ఇచ్చే సందేశం అన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌ ముదిరాజ్‌, వినోద్‌కుమార్‌, భగవంతురావు ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, అబ్దుల్‌ జకీ, అజ్మత్‌అలీ, అవేజ్‌, ఫయాజ్‌, గులాం జహీర్‌, షాఫైసల్‌, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకుని ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ వేడుకలు1
1/1

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement