
మతసామరస్యాన్ని కాపాడుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: బక్రీద్ పండగ సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలో ఉన్న ఈద్గాల దగ్గర ఎస్పీ డి.జానకి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ భద్రతను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్యం నిలుపుకోవడం అందరి బాధ్యత అని, వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎప్పుడూ కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులపై పెట్టిన
కేసులు ఎత్తివేయాలి
పాలమూరు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేసిన దీక్షల నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం 2023లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ, 12 గ్రామాల రైతులు, ప్రజలు కంపెనీ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. సరైన న్యాయం కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే చిత్తనూర్లో ఇథనాల్ కంపెనీ వల్ల పెరిగిన కాలుష్య పరిస్థితిని అర్థం చేసుకుని కంపెనీ రద్దు చేయకపోతే తమ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు.
● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు.
‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉపాధి హామీ కూలీలతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎఫ్ఏ)కు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ అన్నారు. శనివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూలీలకు తొమ్మిది వారాల నుంచి, ఎఫ్ఏలకు మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. ఈ విషయమై గత నెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా ఉపాధి కూలీలకు రోజుకు రూ.600, పని దినాలు 200 రోజులకు పెంచాలని, ఎఫ్ఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, 4 కి.మీ. దూరం పనికి వెళితే ఆటో చార్జీలు సైతం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న హైదరాబాద్లోని గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనరేట్ (సీఆర్డీ) ఎదుట నిర్వహించే ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.