
మహిళలకు న్యాయ సహాయం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వృద్ధులు, మహిళలు న్యాయ సహాయం పొందేందుకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. శుక్రవారం స్థానిక బీకేరెడ్డి కాలనీలోని మహబూబ్నగర్ ఫస్ట్– నవరత్నాలు’ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆందోళన చెందవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, గృహహింస, లింగ వివక్ష లాంటివి ఎదురైనప్పుడు బాధితులు వెంటనే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని లేదా సఖీ కేంద్రంలో కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. చివరగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహర్, సెట్విన్ నిర్వాహకుడు విజయ్కుమార్, పారా లీగల్ వలంటీర్ల ప్రతినిధి గన్నోజు చంద్రశేఖర్, పీఎల్వీలు రవికుమార్, నస్కంటి నాగభూషణం, ఎ.రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు.
ఖైదీల సమస్యలపై ఆరా..
పాలమూరు: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు బెయిల్ కోసం లీగల్ ఎయిడ్ న్యాయవాదులు కావాలంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో సంప్రదించి న్యాయ సహాయం పొందాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని జైలును శుక్రవారం న్యాయమూర్తి సందర్శించి మొదట జైలు బ్యారక్లు, కిచెన్, ఇతర పరిసరాలు పరిశీలించారు. జైలులో అన్ని వసతులు, సదుపాయాల సరిగ్గా అందుతున్నాయా లేదా అని అధికారులను, ఖైదీలను వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా బ్యారక్ల దగ్గరకు వెళ్లి నేరుగా ఖైదీలతో వారి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ వెంకటేశం పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర