
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
నర్సంపేట రూరల్ : పలు చోరీలకు పాల్పడిన కేసుల్లో నిందితులను అరెస్టు చేసి ఆరుగురిని రిమాండ్కు తరలించగా, ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.19.20లక్షల సొత్తును రికవరీ చేసినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ పేర్కొన్నారు. శనివారం నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన పుల్లూరి రాజేష్ (ఆటో డ్రైవర్), నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంటకు చెందిన వర్రెంకి అక్షయ్ కుమార్ (డెకరేషన్ వర్క్), స్నేహనగర్కు చెందిన జెట్టి అక్షయ్, నీరుపల్లి సాయిరాం (మెకానిక్ వర్క్), నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకల ఉదయ్, నర్సంపేటకు చెందిన అలువాల విపిన్, ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన ఎండీ సుబాని (బ్యాటరీ వర్క్) అంతా కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు. చేసే పనిలో డబ్బులు రాకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాజేష్ ఆటోలో, ద్విచ క్ర వాహనంపై, విపిన్ స్కూటిపై పగటిపూటలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నర్సంపేటలోని నెక్కొండ రోడ్డులో గల ఫైనాన్స్లో అనుమానం రాకుండా రాజేష్ అతడి స్నేహితుడు ఎండీ సుబాని పేరుతో బంగారం కుదవపెట్టి, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకోని జల్సాలకు పాల్పడుతున్నారు. అయితే నర్సంపేట పోలీస్ స్టేషన్లో–6 కేసులు, నల్లబెల్లి పీఎస్లో–1, పర్వతగిరి పీఎస్ లో–1చొప్పున మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. మొత్తం ఏడుగురిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి ఆటో, ద్విచక్రవాహనం, స్కూటీ, ల్యాప్టాప్, మొబైల్, 13తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 2,000ల నగదు మొత్తం రూ.19.20 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసు త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించి, రివార్డులను అందించారు. నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు రఘుపతిరెడ్డి, సాయిచరణ్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆరుగురి రిమాండ్ .. పరారీలో ఒకరు
ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్

చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్