
‘అక్షర వాచస్పతి’ దాశరథి
చిన్నగూడూరు: అక్షరమే ఆయుధంగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాంది పలికిన ‘అక్షర వాచస్పతి’(జ్ఞానానికి అధిపతి) దాశరథి రంగాచార్య. మానుకోట జిల్లాలోని ఉద్యమాల పురిటిగడ్డ చిన్నగూడూరు ప్రస్తుతం మండల కేంద్రంగా కొనసాగుతోందంటే కారణం దాశరథి సోదరులు (దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు) స్ఫూర్తితోనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు(ఆదివారం) దాశరథి రంగాచార్యుల వర్థంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
చిన్నగూడూరులో వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో వెంకటాచార్యులు– వెంకటమ్మ దంపతులకు 24 ఆగష్టు 1928 సంవత్సరంలో దాశరథి రంగాచార్యులు జన్మించారు. విద్యాభ్యాసం ఖమ్మం జిల్లాలో సాగింది. 12 ఏళ్లకే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. తెలంగాణ పల్లెల్లో నాటి జీవన విధానాన్ని ఆయన రాసిన నవలల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు అనే నవలలు ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి. రంగాచార్యులు సోదరుడు దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నవాబు పాలనను ఎదిరించి ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తన కవిత్వంతో వెలుగెత్తి చాటి తెలంగాణ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడిగా పేరొందాడు. తమ్ముడు రంగాచార్య వచనంతో అన్న కృష్ణమాచార్యుల బాటలో నడిచి మలిదశ ఉద్యమానికి ఊపిరిపోశాడు. నిజాం పాలనలో అరాచకాలు, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ఉద్యమబాటలో నడిచాడు. దాశరథి రంగాచార్యులు సాహితీవేత్తగా, సాయుధ పోరాట యోధుడిగా, బహూముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన రాసిన నవలలు తెలంగాణకే పరిమితం కాకుండా భారతదేశమంతటా కీర్తి గడించాయి. ఉపాధ్యాయుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, సికింద్రాబాద్ పురపాలక శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు.
పురస్కారాలు..
వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించారు రంగాచార్యులు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. ఆయన రాసిన చిల్లర దేవుళ్లు రచనకు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1980 సంవత్సరంలో వెంకటశివయ్య సాహితీ పురస్కారం, 2000 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు. తెలుగు సాహిత్య రచనల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఆయన 2015 జూన్ 8న తుది శ్వాస విడిచారు. దాశరథి సోదరులు పుట్టిన చిన్నగూడూరులో వారి జ్ఞాపకార్థంగా దాశరథి గ్రంథాలయం ఏర్పాటు చేసి, చిన్నగూడూరును దాశరథి గూడూరుగా నామకరణం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నేడు రంగాచార్యుల వర్థంతి

‘అక్షర వాచస్పతి’ దాశరథి