
‘ఓపెన్ స్కూల్’ పరీక్షల ఫలితాలు విడుదల
● ఉమ్మడి జిల్లాలో టెన్త్లో 69.04 శాతం..
● ఇంటర్లో 67.17 శాతం ఉత్తీర్ణత
విద్యారణ్యపురి: ఈ ఏడాది ఏప్రిల్–మే లో నిర్వహించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ పరీక్షలకు 2,478 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 1,711 మంది (69.04 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,449 మంది హాజరుకాగా 2,989 మంది విద్యార్థులు(67.17శాతం) ఉత్తీర్ణత సాధించారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేట్ అనగోని సదానందం తెలిపారు.
జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు..
● హనుమకొండ జిల్లాలో టెన్త్లో 390 మంది విద్యార్థులకు గాను 318మంది (81శాతం), ఇంటర్లో 997 మందికిగాను 673 మంది (67శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● వరంగల్ జిల్లాలో టెన్త్లో 476 మందికిగాను 127 మంది (27శాతం), ఇంటర్లో 650 మందిలో 323 (49శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● మహబూబాబాద్ జిల్లాలో టెన్త్లో 441 మందికిగాను 337 మంది (76 శాతం), ఇంటర్లో 657మందికిగాను 488 మంది (74శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● జనగామ జిల్లాలో 349మందికిగాను 293మంది (84శాతం), ఇంటర్లో 942మందిలో 777 మంది ఉత్తీర్ణత (82.1శాతం) సాధించారు.
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్త్లో 269 మందికిగాను 216 మంది (80శాతం), ఇంటర్లో 394 మందికిగాను 302 మంది (76.6శాతం) ఉత్తీర్ణత సాధించారు.
● ములుగు జిల్లాలో 553 మంది విద్యార్థులకుగాను 420 మంది (76 శాతం), ఇంటర్లో 809 మందికిగాను 426 మంది విద్యార్థులు (51.7శాతం) ఉత్తీర్ణత సాధించారు.
చోరీలకు పాల్పడిన నలుగురి అరెస్ట్
కమలాపూర్: తాళాలు పగులగొట్టి ఆలయాల్లోకి చొరబడి హుండీలను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ హరికృష్ణ తెలిపారు. శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని గూడూరు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా జమ్మికుంట మారుతినగర్కు చెందిన జానబోయిన అరవింద్, హుజూరాబాద్ కొత్తపల్లికి చెందిన గుల్ల ప్రవీణ్, హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లికి చెందిన గట్టు మనోజ్, జమ్మికుంట ఇందిరానగర్కు చెందిన శ్రీరాముల రాజేష్ అనే నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారని తెలిపారు. వాహనాలతోపాటు వారిని తనిఖీ చేయగా వారి వద్ద రూ.38 వేలు లభించాయని, వివరాలు అడగ్గా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. దీంతో కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం, భీంపల్లి గ్రామాల్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయాలతోపాటు జమ్మికుంట, దామెర, శాయంపేట, ఆత్మకూరు మండలాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.38 వేల నగదు, 2 బైక్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్సై వీరభద్రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.