
చదువుల కల చెదిరింది..
నెహ్రూసెంటర్/కురవి: టెన్త్ వార్షిక పరీక్షల్లో ఫస్ట్ క్లాసులో పాసైన విద్యార్థిని ఇంటర్మీడియట్ చదివేందుకు సిద్ధమవుతూ విధి ఆడిన వింత నాటకంలో రోడ్డు ప్రమాదానికి గురై కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మానుకోట జిల్లా కురవి మండలానికి చెందిన తొడుసు వెంకన్న, సరిత దంపతుల కుమార్తె నేహ(15) ఇంటర్ చదివేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తన తల్లి సరితతో కలిసి జిల్లా కేంద్రంలోని ఓ కంటి ఆస్పత్రిలో చూపించుకుని, దుస్తులు కొనుగోలు చేసి ఆటోలో తిరుగుపయనమయ్యారు. కురవి శివారు లింగ్యాతండా సమీపంలో 365 జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ఆటోను అశోక్ లేలాండ్ వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో నేహ అక్కడికక్కడే మృతి చెందగా తల్లి సరిత, డ్రైవర్ కానుగంటి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ రాజు, తల్లి సరితను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన నెమలి వంశీని ప్రత్యక్ష సాక్షులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కురవి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తండ్రి వెంకన్న కుమార్తె నేహ మృతదేహంపై పడి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు. ఇదిలా ఉండగా.. తీవ్ర గాయాలపాలైన సరిత, రాజుకు ఎక్స్రే, సీటీ స్కాన్ అవసరముండగా ప్రభుత్వ ఆస్పత్రిలో టెక్నిషియన్స్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ సెంటర్ను ఆశ్రయించాల్సి వస్తుందని బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు. నేహ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు జ్యోతిబసు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఇంటర్ చదివేందుకు సిద్ధమవుతూ అనంత లోకాలకు..
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
ప్రాణాపాయస్థితిలో తల్లి
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

చదువుల కల చెదిరింది..

చదువుల కల చెదిరింది..