
మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
మహబూబాబాద్ రూరల్: రైతులు ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడొద్దని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. మహబూబాబాద్ పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో ఏడీఏ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి ఫిజికల్ స్టాక్ వివరాలు, ధరల పట్టికలు రైతులకు కనపడే విధంగా ఉంచాలని తెలిపారు. రైతులు ఎక్కువ మోతాదులో రసాయనికి ఎరువులు వాడవద్దని, వాటి స్థానంలో పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించుకుని భూసారాన్ని కాపాడాలని కోరారు. మహబూబాబాద్ డివిజన్ పరిధిలో పచ్చిరొట్ట విత్తనాలు జీలుగ, జనుములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు