
పనులు పెండింగ్!
పూర్తికాని ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు
జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తాగునీటి పైపులైన్ కోసం రూ రూ.3,5000, మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.లక్ష, విద్యుత్ మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్ల కోసం రూ.50,000 నిధులు మంజూరయ్యాయి. అయితే ప్రహరీ, భవనం శిథిలావస్థలో ఉంది. అలాగే మరుగుదొడ్ల పనులు పూర్తి కాలేదు. పనులు పూర్తికాకపోవడంతో అద్దె భవనంలో పాఠశాల కొనసాగుతోంది.
● టాయిలెట్స్ అందుబాటులో లేక ఇబ్బందులు
● పలుచోట్ల తరగతి గదుల కొరత
● వరండాల్లోనే విద్యార్థుల చదువులు
● బిల్లులు రాక పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లు
● ఐదు రోజుల్లో స్కూళ్లు పునఃప్రారంభం
సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులు నడవాలి. అందుకోసం అన్ని వసతుల కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ప్రవేశపెట్టింది. అయితే పాఠశా లల్లో విద్యార్థులకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక.. ఉన్నచోట నీటి వసతి లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పనులు పూర్తి చేసినా.. అధికారులు కావాలనే బిల్లులు చేయలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తేనే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని కొందరు కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నారు. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై ‘సాక్షి’ పరిశీలనాత్మక కథనం.
పథకం వివరాలు..
జిల్లాలో మొత్తం పాఠశాలలు : 922
అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి
ఎంపికై న స్కూళ్లు: 438
పనులు పూర్తి చేసి అప్పగించినవి : 403
బిల్లులు చేయలేదని అప్పగించనివి : 35
మొత్తం పనుల అంచనా విలువ :
రూ. 12.42 కోట్లు
కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లులు: రూ. 9 కోట్లు
నిధులు నిలిచిపోయినవి : రూ 3.42 కోట్లు
438 పాఠశాలల ఎంపిక
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో 438 బడులు ఎంపికయ్యాయి. సుమారు రూ.12.42కోట్లు నిధులు కేటాయించారు. కాగా 403 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా.. రూ.9 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అయితే చేసిన పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో బిల్లులను అందించకపోవడంతో నిధులు మంజూరుకాలేదని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. చేసిన పనుల బిల్లులన్నీ అందిస్తే పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు.

పనులు పెండింగ్!