
జోరుగా బెల్లం దందా..
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో నల్లబెల్లం దందా జోరుగా సాగుతోంది. గుడుంబా తయారీ, క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం జిల్లాకు నల్లబెల్లం రవాణా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం యథేచ్ఛగా బెల్లం దందా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా జిల్లాకు రవాణా అవుతోందని, దీనికి పోలీసు, ఎకై ్సజ్ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
యథేచ్ఛగా బెల్లం సరఫరా..
అక్రమ సంపాదనకు అలవాటుపడిన జిల్లాకు చెందిన సుమారు పదిమంది వ్యాపారులు అడ్డదారుల్లో బెల్లం సరఫరా చేస్తున్నారు. సిండికేటుగా ఏర్పడి ఎ కై ్సజ్, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని తండాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు, చిత్తూరు నుంచి నల్లగొండ జిల్లా నుంచి మరిపెడ మీదుగా మహబూబాబాద్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. బెల్లం వ్యాపారమంతా జిల్లాలోని మండలాల శివారు గ్రామాలు, తండాల్లో జరుగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల పరిధి తమదికాదంటే తమదికాదంటూ సాకులు చెబుతూ ఎకై ్సజ్, పోలీసు అధికారులు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారం వారి కనుసన్నల్లోనే కొనసాగుతోందని విశ్వసనీయ సమాచారం.
అక్కడ ధర తక్కువ.. ఇక్కడ ఎక్కువ
వ్యాపారులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నల్లబెల్లం తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాకు తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లారీలు, డీసీఎం, ఇతర వాహనాల ద్వారా తెప్పించి టన్నులకొద్దీ క్రయవిక్రయాలు జరిపి కోట్లాది రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలో క్వింటా నల్లబెల్లం ధర రూ.5 వేలు ఉండగా ఇక్కడ ధర రూ.9 వేల నుంచి రూ.10 వేలకుపైగా పలుకుతోంది. కాగా నల్లబెల్లంతో తండాల్లో గుడుంబా తయారీ చేసి అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. కాగా ఎకై ్సజ్, పోలీస్ అధికారులు నల్లబెల్లం రవాణాను కట్టడి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాకు ప్రతీరోజు రెండు నుంచి మూడు లారీల నల్లబెల్లం వస్తుంది. వ్యాపారులు అధికారుల కళ్లుకప్పి వారికి అనువైన ప్రాంతాల్లో డంపు చేసి అక్కడి నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా తండాలకు తరలించి సొమ్ము చేసుకుంంటున్నారు.
తనిఖీలు అంతంత మాత్రమే..
జిల్లాలో అధికారులు కొంతమేరకు బెల్లం పట్టుకుని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో బడా బెల్లం వ్యాపారులు తమ వ్యాపారాన్ని ఇష్టమొచ్చినట్లు సాగిస్తున్నారు. రైళ్లు, ఇతర వాహనాల ద్వారా తక్కువ మొత్తంలో బెల్లం తీసుకువచ్చే వ్యాపారులు మాత్రమే అధికారులకు పట్టుబడుతుండగా..పెద్ద మొత్తంలో రవాణా చేసే వారిని పట్టుకున్న దాఖతాలు లేవు.
నమోదు చేసిన కేసులు..
జిల్లాలో ఎకై ్సజ్ అధికారులు 15,605 కిలోల నల్లబెల్లం, 1,258కిలోల పటిక, 3,442 లీటర్ల గుడుంబా స్వాధీనం చేకున్నారు.అలాగే 161 వాహనాలను సీజ్ చేసి, 553 కేసులు నమోదు చేసి, 225 మందిని అరెస్టు చేశారు. 2022లో ఏడుగురిపై, 2023లో ఏడుగురిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయగా, మరో 8 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే పోలీస్ అధికారులు 38,940 కిలోల నల్లబెల్లం, 2,251 పటిక స్వాధీనం చేసుకుని, 27 వాహనాలు సీజ్ చేసి, 47 కేసులు నమోదు చేసి 98 మందిని అరెస్టు చేశారు.
అక్రమార్కులను ఉపేక్షించేది లేదు..
జిల్లాలో ఎక్కడ కూడా నల్లబెల్లం, ఇతర అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారిని ఉపేక్షించేది లేదు. అక్రమ వ్యాపారాలపై నిఘాపెట్టి పోలీసు అధికారులు, సిబ్బంది, టాస్క్ ఫోర్స్, ప్రత్యేక బృందాలతో రైళ్లు, వాహనాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. గ్రా మాలు, తండాల్లో నల్లబెల్లం, గుడుంబా రవాణా, క్రయవిక్రయాలపై ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించి సమాచారం ఇస్తే ఒక్క కిలో కూడా వదిలిపెట్టకుండా కేసులు నమోదు చేస్తాం.
– సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ
నల్లబెల్లం కట్టడికి ప్రత్యేక చర్యలు
జిల్లాలో ఇప్పటివరకు నల్లబెల్లం క్రయవిక్రయాలు, గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నాం. 14 మందిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి 5వేల మందిని బైండోవర్ చేశాం. బైండోవర్ ఉల్లంఘించిన వారితో జరిమానాలు కట్టించాం. నల్ల బెల్లం అక్రమ రవాణాపై ఎకై ్సజ్, డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది ప్రతీరోజు దాడులు నిర్వహిస్తున్నారు. రైళ్లలో, యాత్ర రవాణా మార్గాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
– బి.కిరణ్, డీపీఈఓ
యథేచ్ఛగా బెల్లం సరఫరా,
క్రయవిక్రయాలు
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
అధికారుల సహకారంపై అనుమానాలు

జోరుగా బెల్లం దందా..

జోరుగా బెల్లం దందా..