
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
హన్మకొండ : వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు, మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అందులో భాగంగా మే 5నుంచి జూన్ 13వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల వ్యాప్తంగా 50కి పైగా బృందాలను నియమించారు. ప్రతి బృందంలో విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, కళాశాల విద్యార్థులు, అభ్యుదయ రైతులు ఉంటారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ పరిశోధ సంస్థలు, వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలోని శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొంటారు.
ఈ సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహా సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి మాట్లాడుతూ.. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సలహాలతో పాటు వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడానికి అవసరమైన సూచనలు, యాంత్రీకరణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు స్వయంగా పాల్గొనడం ద్వారా గ్రామీణ స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మే 5నుంచి జూన్ 13వరకు కార్యక్రమాలు