
కార్పొరేటర్పై అక్రమ కేసులను సహించబోం
కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చోటు చేసుకున్న చిన్న గొడవను సాకుగా చూపి తమ పార్టీ కార్పొరేటర్ షేక్ యూనుసు బాషాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ కేసుల విషయాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి నగర మేయర్ వివరించారని, న్యాయం చేస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో స్పీకర్పై పేపర్లు చించివేయడం, గొడవ చేయడం, ఇబ్బందులు సృష్టించిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయన్నారు. అయితే ఎప్పుడూ సంబంధిత ప్రజా ప్రతినిదులపై కేసులు పెట్టిన దాఖలాల్లేవన్నారు. అలాంటిది గతనెల 26న కర్నూలు కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ షేక్ యూనుసుబాషాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సర్వసభ్య సమావేశంలో 4వ వార్డు కార్పొరేటర్ ఆర్షియా పర్వీన్ అడిగిన ప్రశ్నకు అడ్డు తగిలినందుకు 10వ వార్డు కార్పొరేటర్ ఆమెకు మద్దతుగా మాట్లాడారన్నారు. అక్కడే ఉన్న 12వ వార్డు కార్పొరేటర్ కలుగజేసుకొని గట్టిగా వాదించడం వల్లే చిన్నపాటి గొడవ జరిగిందన్నారు. ఆ సమయంలో ఇనుప కుర్చీ ఎత్తి కింద పడేశారన్నారు. దీన్ని సాకుగా చూపి ఇనుప కుర్చీ విరిగిందని, ఒకరిద్దరికి గాయాలయ్యాయని అదనపు కమిషనర్ ఆర్జీవీ. క్రిష్ణ రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గాయాలు అయినట్లయితే ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, ఎంఎల్సీ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. తమ కార్పొరేటర్లను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే అధికారిపై కేసులు వేసి విశాఖపట్నం నుంచి కర్నూలుకు తిప్పడం ఖాయమన్నారు.
● కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్లు గొడవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కౌన్సిల్కు వచ్చారన్నారు. కేసు పెట్టిన క్రాంతికుమార్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అని, అయితే టీడీపీ కార్పొరేటర్ అంటూ రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో తమ కార్పొరేటర్పై కేసు పెట్టారన్నారు. పార్టీ టిక్కెట్టు ఇచ్చి కార్పొరేటర్గా, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తే డబ్బులకు అమ్ముడుపోయి దిగజారి కేసులు వేయడం మంచి సంప్రదాయం కాదన్నారు.
● స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమసింహారెడ్డి, గాజుల శ్వేతారెడ్డి మాట్లాడుతూ కుల రాజకీయా లు, నీతిలేని రాజకీయాలు టీడీపీకే చెల్లు అన్నారు.
● సమావేశంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు దండు లక్ష్మీకాంత రెడ్డి, సుదర్శన్ రెడ్డి, క్రిష్ణకాంత్ రెడ్డి, జుబేర్, ఆర్షియా ఫర్హీన్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షేక్ అహమ్మద్, మునెమ్మ పాల్గొన్నారు.