
జిల్లాలో 2.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవం సందర్భంగా 2.60 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనంతో కళకళలాడుతూ జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో నగరంలోని సత్యనారాయణపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు కారణం వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడమేనన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని సూచించారు. భూమిపైనే కాక భవనాలపై మిద్దెతోటలను పెంచితే నగరాన్ని కాలుష్యం కోరలు నుంచి కాపాడుకోగలుగుతామన్నారు. మొక్కలు నాటి సంరక్షించేందుకు ముందుకు వచ్చే ప్రతిఒక్కరికీ అవసరమైన మొక్కలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందన్నారు. ర్యాలీలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈఈ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, సేఫ్ ఎన్విరాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధి ఏలూరి లీలా కుమారి, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ