
ఇంద్రకీలాద్రిపై నవగ్రహ పునఃప్రతిష్ట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం మండప పూజలు, మూలమంత్ర హవనం, అధివాసాలు వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం నవగ్రహ ప్రతిష్ట నిమ్తితం అవసరమైన యంత్రాలను ఆలయ అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మల్లేశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకు రాగా, కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో 7–52 గంటలకు నవగ్రహ పునఃప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట జరిగింది. అనంతరం నూతన యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ. ప్రసాద్, కోట ప్రసాద్ , మల్లేశ్వర శాస్త్రిలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాద వితరణ జరిగాయి. శుక్రవారం నుంచి నవగ్రహ మండపంలోని భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.