
బందోబస్తును పకడ్బందీగా నిర్వర్తించండి
జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు
కోనేరుసెంటర్: మసూల బీచ్ ఫెస్టివల్ బందోబస్తును సమర్థంగా, పకడ్బందీగా నిర్వర్తించి పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి బుధవారం ఆయన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బీచ్ అవుట్ పోస్టు పోలీస్స్టేషన్ వద్ద బందోబస్తు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్ ముగింపు వరకు శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జనం భారీగా తరలివస్తారని ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రీడా పోటీలకు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు హాజరవుతారని, వారి రాకపోకలకు, భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఆ దిశగా బందోబస్తును నిర్వర్తించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పాయింట్లలో ఉంటూ నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లలో ఉన్న సిబ్బంది వచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసేలా చూడాలని, ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ ఏఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

బందోబస్తును పకడ్బందీగా నిర్వర్తించండి