
క్వారీల్లో కంకర స్వాహా
ఎన్టీఆర్ జిల్లాలో రాతి క్వారీల్లో విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో దాదాపు 154 రాతి క్వారీలు, 97 స్టోన్ క్రషర్లు ఉన్నాయి. కొన్ని క్వారీలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని కొండల్లో అక్రమంగా కంకరను తవ్వుతు న్నారు. క్వారీల సమీపంలో సాగర్ కాలువలను సైతం కబ్జా చేసి రోడ్లు వేసుకుని రాతి క్వారీల గుత్తేదారులు రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అదేమంటే అమరావతి నిర్మాణానికి కంకర ఎంతో అవసరం కాబట్టే తామంతా వ్యాపారం చేస్తున్నామని బహిరంగంగా చెప్పుకొంటున్నారు. కంకర తీసే సమయంలో బ్లాస్టింగ్ చేసేటప్పుడు కనీసం ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించటంలేదు. అధిక మొత్తంలో పేలుడు పదార్థాలు ఉపయోగించటం ద్వారా క్వారీల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటు న్నారు. కార్మికుల ప్రాణాలు పోగొ ట్టుకుంటున్న సమయంలో వారి కుటుంబాలకు క్వారీల నిర్వాహకులు ఎంతో కొంత ముట్టజెప్పి పోలీసు కేసులు కాకుండా చూసుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు రాతి క్వారీల నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని అక్రమ తవ్వకాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.