
క్రీడాకారుల్లో శక్తి, యుక్తికి యోగా సరైన మార్గం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రీడాకారులు పోటీల్లో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన శక్తితోపాటు యుక్తికి యోగా దోహదపడుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం క్రీడాకారుల థీమ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులు, అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, జూడో, కబడ్డీ, నెట్బాల్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, హాకీ, టేబుల్ టెన్నిస్, హ్యాండ్బాల్, రెజ్లింగ్ విభాగాల క్రీడాకారులు, జిమ్ ట్రైనర్లు, యోగా ఔత్సాహికులు కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈసందర్భంగా నగర కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ యోగాసనాలను ప్రతి ఒక్కరూ నేర్చుకొని జీవితాంతం ఆచరించడం ద్వారా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. బీఆర్టీఎస్ రోడ్డు యోగా స్ట్రీట్లోనూ ప్రతిరోజూ ఉదయం 6గంటల నుంచి 7గంటల వరకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా క్రీడాకారులతో యోగాసనాలు సాధన చేయడం ఆనందంగా ఉందన్నారు. యోగా సాధనను ఏదో ఒక రోజుకు పరిమితం చేయకుండా తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు వీలుంటుందని ఽకమిషనర్ వివరించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు.
కమిషనర్ ధ్యానచంద్ర