రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కొటిక్స్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్), జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. పోలీసు జాగిలాలతో కలిసి ప్లాట్ఫారంలతో పాటు వెయిటింగ్ హాల్స్, పార్శిల్ కార్యాలయం, ప్రయాణికుల లగేజీలు పరిశీలించారు. ఆ సమయంలో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపైకి వచ్చిన పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్(17479) రైలులో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్లలో క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎటువంటి మాదకద్రవ్యాలు కాని, అనుమానిత వస్తువులు కానీ కనిపించలేదని ఆర్పీఎఫ్ సీఐ జె.వి రమణ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలను అరికట్టేందుకు తరచూ రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాలలో తరచూ ఇటువంటి తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
తప్పుడు కేసులు ఎత్తివేయాలి
తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు తమ పార్టీ నాయకులపై నమోదు చేసిన తప్పుడు కిడ్నాప్ కేసులు ఎత్తివేయాలని నగర పంచా యతీ కౌన్సిలర్లు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసులపై గత నెల 20న పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వాస్తవం లేదన్నారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని 13, 20 వార్డుల కౌన్సిలర్లు ఇనపనూరి చిన్నారి, షేక్ నదియాలు లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసులు ఉపసంహరించని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, ప్రకాష్ తెలిపారు.
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో ఆలయ ఈవో శీనానాయక్ దంపతులతో పాటు 27 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఇక మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో నిర్వహించిన ఛండీహోమంలో 183 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ యాగశాలలో కూర్చునేందుకు వీలు లేకపోవడంతో యాగశాల ఆరు బయట కూర్చొని భక్తులు యాగంలో పాల్గొన్నారు. ఇక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో సైతం ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
పెనుగంచిప్రోలు పీహెచ్సీ తనిఖీ
పెనుగంచిప్రోలు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, సిబ్బంది రికార్డులను పరిశీలించారు. ల్యాబ్, మందుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. సర్వేలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన సర్వేలను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఈహెచ్ఆర్ నిర్వహణ,ఎన్సీడీ–సీడీ సర్వే, గర్భిణుల నమోదు తదితర కార్యక్రమాల అమలుపై సమీక్ష చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.

రైల్వే స్టేషన్లో ‘ఈగల్’ డ్రైవ్