
పుష్కర స్నానాలకు వెళ్లొస్తూ..
నందిగామ టౌన్: తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లి తిరిగి వస్తూ కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు కృష్ణాజిల్లా పెద్దపారుపుడి మండలం వెంట్రప్రగడ గ్రామస్తుడు చింటూరి వెంకటేశ్వరరావు (66). అతను, భార్య నాగమణి, పెద్దకుమార్తె మోటమర్రి శ్యామల, బంధువులైన రవి, భార్య లక్ష్మితో పాటు విజయవాడకు చెందిన కారు డ్రైవర్ కొమరంపల్లి కార్తీక్తో కలిసి కారులో సరస్వతీ నది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లారు. పుష్కర స్నానాలు ముగించుకుని శనివారం తిరుగు ప్రయాణమయ్యారు.
అనాసాగరం వద్ద అదుపుతప్పిన కారు
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున పట్టణ సమీపంలోని అనాసాగరం వద్ద ఫ్లై ఓవర్పై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావుతో పాటు గాయపడిన వారిని స్థానికులు కారులో నుంచి బయటకు తీశారు. అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించగా వెంకటేశ్వరరావు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు వెంకటేశ్వరరావు కేటరింగ్ పనులు చేస్తుంటాడు. మృతునికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
డివైడర్ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

పుష్కర స్నానాలకు వెళ్లొస్తూ..