
రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో బయట నుంచి తోపుడు బండ్లపై వచ్చి ఆహార విక్రయాలు చేస్తున్న వారిపై రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టేషన్ డైరెక్టర్, సిబ్బంది ఆదివారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అనధికార విక్రేతలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్టేషన్ దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద కొందరు బయట నుంచి తోపుడు బండ్లపై టిఫిన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్టేషన్ పరిసరాల్లో ప్రహరీ పక్కన కొంత మంది బడ్డీకొట్లలో నాణ్యత, పరిశుభ్రత లేకుండా ప్యాకింగ్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్లు, గుట్కా, సిగరెట్ల విక్రయాలు సాగిస్తుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఏడుగురు అనధికార విక్రేతలను అదుపులోకి తీసుకుని ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ రైలు ప్రయాణికుల భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కొందరు విక్రేతలు మాత్రం పరిశుభ్రత, నాణ్యత లేకుండా రైలు ప్రయాణికులకు నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
అనధికార విక్రేతలపై చర్యలు