
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
పెంచికల్పేట్(సిర్పూర్): తాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీలోని కోయచిచ్చాలలో మంగళవారం పర్యటించారు. మూడు చేతిపంపులు చెడిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్బర్ట్, ఎస్సై కొమురయ్య, ఆర్డబ్ల్యూ ఏఈ ఖదీర్, ఏపీవో సతీశ్, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
దహెగాం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని దిగిడలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీ పనులు, సీసీరోడ్ల నిర్మాణాలు, తాగునీటి వనరులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శించొ ద్దన్నారు. వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇనోస్, ఈజీఎస్ ఏపీవో కల్పన తదితరులు ఉన్నారు.