
ప్రయాణికులు కిటకిట.. బస్సులు కటకట..
ఇల్లెందు: ఇల్లెందు బస్స్టేషన్ పరిధిలో నాలుగు రూట్లలో బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తగిన సర్వీసులు లేక ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. ఆదివారం ఇల్లెందు బస్స్టేషన్లో మహబూబాబాద్, గుండాల రూట్లో బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా అధికారులు తగిన సంఖ్యలో సర్వీసులు పెంచడంలేదు. ఇల్లెందు–మహబూబాబాద్, ఇల్లెందు–గుండాల, ఇల్లెందు–కొత్తగూడెం, ఇల్లెందు–ఖమ్మం రూట్లలో ప్రయాణికులకు బస్సులు సరిపోవటం లేదు. ఉన్న సర్వీసులూ సమయపాలన పాటించడంలేదు. స్టేషన్లోనే బస్సు నిండిపోడటంతో డ్రైవర్లు పట్టణంలోని ఇతర స్టేజీల్లో నిలుపకుండా వెళ్లిపోతున్నారు. గత నెలలో ఇల్లెందులో పర్యటించిన ఆర్టీసీ ఈడీ సోలోమెన్ పలు రూట్లలో బస్సులు నడపాలని ఆదేశించారు. అయితే చెట్టుపల్లి మినహా ఇతర ఏ ఒక్క రూట్లో కూడా బస్సులు పెంచలేదు. రాత్రి 8 గంటల తర్వాత మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం డిపోల నుంచి ఇల్లెందు వైపు సర్వీస్లు లేవు. కరీంనగర్ నుంచి భద్రాచలం వెళ్లే బస్సులు, భద్రాచలం నుంచి కరీంనగర్కు వెళ్లే బస్లు తప్ప సమీప డిపోల నుంచి ఇల్లెందుకు నడిచే షటిల్ సర్వీస్లు ఉండటం లేదు. ఖమ్మం నుంచి ఇల్లెందుకు రాత్రి సమయంలో బస్సు లేకపోవడంతో నియోజకవర్గప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి మణుగూరు, భద్రాచలం వచ్చే రెండు, మూడు సర్వీసులను రాత్రి పూట ఇల్లెందు మీదుగా మళ్లిస్తే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పే అవకాశం ఉంది. గుండాల ఎక్స్ప్రెస్ సర్వీస్, గుండాల–హైదరాబాద్ వెళ్లే సర్వీస్లు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
నాలుగు రూట్లలో సరిపడాలేని ఆర్టీసీ సర్వీసులు